Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదిరెండవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 22

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదిరెండవ అధ్యాయము

పామువిషమునుంచి తప్పించుట

1.బాలాసాహెబు మిరీకర్ 2.బాపుసాహెబు బుట్టీ 3.అమీరు శక్కర్ 4.హేమడ్ పంతు

సర్పములను చంపుటగూర్చి బాబా అభిప్రాయము

ప్రస్తావన

బాబాను ధ్యానించు టెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపమునుగాని అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునపుడు దూరముగానున్న చంద్రుని యాకారమొకగీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు యెడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. “నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక యాత్రాస్థల మాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత ప్రేమను, అశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని, యన్నియు గాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారియొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా, భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా యని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ వారనేక సలహాలు అవసరము ప్రకార మనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవిత మగోచరమైనది. మన మేధా శక్తికి భాషకు అందుబాటులో నుండెడెదికాదు. వారి ముఖమును జూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటయందుగాని, వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిదికాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలు సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానినిగూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వానినుండి సకాలమున బాబా యెట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలా సాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలత్ దారుగా నుండెను. చితిలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. ఆతని యోగ క్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. “నీకు మన ద్వారకామాయి తెలియునా?” బాలా సాహెబునకు బోధపడక పోవుటచే అతడూరకుండెను. “నీ విప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరయితే యామె తొడపయి కూర్చొనెదరో యామె వారిని కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబరభక్తులకు తల్లి. వారిని కష్టములనుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో, వారి కష్టము లన్నియు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీప్రసాద మిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా యిట్లనెను. “నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము” ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాముపడగవలె వంచి, “అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకా మాయిబిడ్డల నేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా, ఆ సర్పమేమి చేయగలదు?” అనెను.

అక్కడున్న వారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహల పడుచుండిరి. కాని బాబా నీవిషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితళీవెళ్ళి యానందించు మనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామ కూడ తనవెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన, రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను. బాబా యిట్లనెను. “సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు.”

ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంట రమ్మనెను. శ్యామా బాబావద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముపామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామాకూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.

బాపుసాహేబు బుట్టీ

నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపు సాహెబుతో నిట్లనియె. “ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక.” ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టీ మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్దకర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్

కోపర్ గాం తాలుకాలో కొరేలా గ్రామనినాసి అమీరు శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్ళవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషదము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా యనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. ఆందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగ 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్ గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్ళు కావలెననగా, అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీని కావిషయ మేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను, పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని యారాత్రియే యచటనుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా “ఓ అబ్దుల్! నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది.” యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యమువలన, బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. (బాబా అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను.) అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

హేమడ్ పంతు (తేలు – పాము)

1. తేలు :– బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి రెండు గ్రంధములు భాగవతమును, భావార్థరామాయణమును నిత్యము పారాయణ చెయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు గూడ శ్రోత యయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించుభాగము చదువునపుడు వినువారందరు మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపయి కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్ధముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండ తన యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి తోటలో పారవైచెను.

2. పాము :– ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి. అది యెటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము

ముక్తారామ్ యను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్పవాక్కలహము జరిగెను. ముక్తారామ్ సర్పములు మొదలగు క్రూరజంతువులను చంప నవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రిసమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటిదిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను. “భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సుత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా, భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరిని రక్షించువాడు. ”

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

మూడవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V. Rama Aravind.
2009-05-13.
Posted on: 2009-05-14.
Last updated on: 2011-11-06.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me